అలాంటి వారు వైఎస్ వారసులు ఎలా అవుతారు?: షర్మిల
- నేడు వైఎస్సార్ 75వ జయంతి
- మంగళగిరిలో సభ
- హాజరైన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
మనల్ని ఆదరించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తన తండ్రి వైఎస్ అనేవారని షర్మిల గుర్తు చేసుకున్నారు. జలయజ్ఞం తన తండ్రికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం అని తెలిపారు. అధికారం వచ్చాక కొందరు ప్రజలకు దూరం అవుతారు... కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో చోటు సంపాదించారని షర్మిల వివరించారు.
"కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రానికి, దేశానికి మంచి చేస్తుందని వైఎస్ నమ్మేవారు. వైఎస్ వారసులం అనేవారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారు. అలాంటి వారు వైఎస్ వారసులు ఎలా అవుతారు? రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది వైఎస్ కోరిక. తన భారత్ జోడో యాత్రకు వైఎస్ పాదయాత్రే స్ఫూర్తి అని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ చివరి కోరిక తీర్చడం మనందరి బాధ్యత" అని షర్మిల పేర్కొన్నారు.