చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్ సభలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్!
- లోక్ సభలోకి మోదీ రెండు ఊతకర్రలతో అడుగుపెట్టారన్న కల్యాణ్ బెనర్జీ
- ఒక ఊతకర్ర చంద్రబాబు, మరో ఊతకర్ర నితీశ్ కుమార్ అంటూ ఎద్దేవా
- చంద్రబాబును ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయంటూ వ్యాఖ్యలు
- కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన బైరెడ్డి శబరి
- చంద్రబాబు ఊతకర్ర కాదని, ఖడ్గం అని స్పష్టీకరణ
చంద్రబాబు విషయంలో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు... సీబీఐ, ఈడీ ఆయనను అరెస్ట్ చేశాయి కదా! అంటూ చంద్రబాబుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే, కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను లోక్ సభలోనే ఉన్న టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా తప్పుబట్టారు.
తమ నాయకుడు చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను లోక్ సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బైరెడ్డి శబరి విమర్శించారు. సీబీఐ, ఈడీ చంద్రబాబును అరెస్ట్ చేశాయి అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
అపారమైన విషయ పరిజ్ఞానం ఉన్న సీనియర్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఇలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ అనే విషయాన్ని గౌరవనీయ తృణమూల్ సభ్యుడు గుర్తించాలని చురక అంటించారు. అది కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల పార్లమెంటు స్థానంలోనే ఆయనను అరెస్ట్ చేశారు అని శబరి సభకు వివరించారు.
అంతేకాదు, చంద్రబాబును కల్యాణ్ బెనర్జీ ఓ ఊతకర్రతో పోల్చుతున్నారని, చంద్రబాబు ఊతకర్ర కాదని, పదునెక్కిన ఖడ్గం అని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ విప్లవం ఎవరి వల్ల సాకారం అయ్యాయో కల్యాణ్ బెనర్జీ ఓసారి చరిత్ర చూసుకోవాలని హితవు పలికారు.