Arvind Kejriwal: మోదీ తాను పెట్టిన ఆ రూల్‌ను ఫాలో అవుతారా?.. అలాగైతే వ‌చ్చే ఏడాది ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోవాలి: కేజ్రీవాల్

  • బెయిల్‌పై విడుదలైన‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీ
  • 75 ఏళ్ల తర్వాత బీజేపీలోని నేతలు రిటైర్ కావాలన్న మోదీ నిబంధనను గుర్తు చేసిన కేజ్రీవాల్‌
  • 2025 సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు.. ఆయ‌న ప్ర‌ధాని పదవి నుంచి దిగిపోతారా అంటూ ప్ర‌శ్నించిన వైనం
  • కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తొలుత యూపీ సీఎం యోగి గ‌ద్దె దిగ‌డం ఖాయ‌మ‌ని జోస్యం
  • ఆ తర్వాత అమిత్ షాను దేశానికి ప్రధానిని చేస్తారని వ్యాఖ్య‌
Delhi CM Arvind Kejriwal ask BJP who will be your Prime Minister

బెయిల్‌పై విడుదలైన‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శనివారం మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికార‌ బీజేపీ, ప్రధాని న‌రేంద్ర‌ మోదీపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వచ్చే ఏడాది మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. 

‘ఇండియా బ్లాక్‌ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతోంది? అయితే వారి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీని నేను అడుగుతున్నా’ అని అన్నారు. కాగా, 2025 సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండుతాయని కేజ్రీవాల్‌ తెలిపారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీలోని నేతలు రిటైర్ కావాలన్న నిబంధన మోదీ పెట్టారని చెప్పారు. ‘లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారు. అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17న మోదీ రిటైర్ కాబోతున్నారా?’ అని ప్ర‌శ్నించారు.

మరోవైపు కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తొలుత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించుతారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అమిత్ షాను దేశానికి ప్రధానిని చేస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘అమిత్ షా కోసం ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు. మోదీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా?, మోదీకి గ్యారెంటీ ఎవరు అందిస్తారు? మీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా?’ అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News