Chandrababu: జగన్ గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు: చంద్రబాబు

Chandrababu satires on CM Jagan manifesto announcement
  • ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్
  • జగన్ గతంలో ఇచ్చిన హామీల వీడియోను పంచుకున్న చంద్రబాబు
  • జగన్ 85 శాతం హామీలు నెరవేర్చలేదని విమర్శలు

సీఎం జగన్ ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథం అని అభివర్ణించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

పూర్తిగా 100 శాతం సన్నబియ్యం ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ రద్దు చేస్తామని, అందరికీ 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని, 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేకహోదా ఎలా రాకుండా పోతుందో చూస్తామని గతంలో జగన్ చేసిన హామీల వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు పంచుకున్నారు. 

దీనిపై ఆయన స్పందిస్తూ... జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో ఇవి కొన్ని అని వెల్లడించారు. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే జగన్ 85 శాతం హామీలను నెరవేర్చలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఈ రోజు ఇంకో మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వచ్చాడని విమర్శించారు. "మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా? అని అడుగుతాడు. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News