SRH: సన్ రైజర్స్ మరో రికార్డ్... వరుసగా మూడు మ్యాచ్ లలోనూ 250 ప్లస్ స్కోరు

SRH set another record by scorning 150 plus runs in a row for third time
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే ఐపీఎల్ లో అత్యధిక స్కోరు రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టిన సన్ రైజర్స్... ఇవాళ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తద్వారా వరుసగా మూడు మ్యాచ్ ల్లో 250 పైచిలుకు స్కోరు చేసిన తొలి జట్టుగా రికార్డు పుటల్లోకెక్కింది. 

అంతేకాదు, టీ20 ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక పర్యాయాలు 250 ప్లస్ స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే (3)తో పాటు సన్ రైజర్స్ (3) కూడా అగ్రస్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ పై 277, ఆర్సీబీపై 287 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ పైనా స్కోరును 250 దాటించింది. 

ఇక ఇవాళ సన్ రైజర్స్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ దశలో ఓపెనర్ల ఊపు చూస్తే స్కోరు 350 చేరడం ఖాయమనించింది. మిడిల్ ఓవర్లలో కొంచెం దూకుడు తగ్గడంతో 300కి లోపే స్కోరు చేసింది. 

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ చూస్తే... ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 6.2 ఓవర్లలో 131 పరుగులు జోడించి, ఐపీఎల్ చరిత్రలోనే ఇంత భీకరమైన దాడి చూడలేదన్నట్టుగా బ్యాట్లు ఝళిపించారు. హెడ్ 89, అభిషేక్ శర్మ 46 పరుగులు చేశారు. 

మిడిల్ ఓవర్లలో తెలుగుతేజం నితీశ్ రెడ్డి 37 పరుగులతో రాణించగా, చివర్లో షాబాజ్ అహ్మద్ ఐపీఎల్ లో తన తొలి అర్ధసెంచరీ నమోదు చేయడం హైలైట్ గా నిలిచింది. షాబాజ్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ముఖేశ్ కుమార్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
SRH
Record
DC
IPL

More Telugu News