Stone Attack On Jagan: అందుకే విజయమ్మ అమెరికా వెళ్లిందంటున్నారు: చింతమనేని

Chintamaneni interesting comments on stone attack
షార్ట్స్‌లో చూడండి
సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే విషయమై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ స్పందించారు. జగన్ పై రాయి దాడి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

గత ఎన్నికల సమయంలో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలం కావడంతో ఎవరైనా బలికావొచ్చని అన్నారు. అందుకే విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లిందని ప్రజలు అంటున్నారని వివరించారు. భాస్కర్ రెడ్డి సైతం జైలులోనే ఉంటా... బయటికి రాను అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు.  

ఎవరు పోతే సానుభూతి వస్తుందని భావిస్తారో, వారు ఎగిరిపోతారని, వీళ్ల రాజకీయ దాహం కోసం సొంత బాబాయే ఎగిరిపోయారని చింతమనేని వ్యాఖ్యానించారు. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని అన్నారు.

"రాష్ట్ర ప్రజలు తనను గద్దె దించేందుకు సిద్ధమయ్యారని జగన్ కు అర్థమైంది కాబట్టే ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఐదేళ్ల కిందట కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడు రాయి డ్రామా ఆడుతున్నాడు. ఎక్కడైనా రాయి తగిలి కిందపడుతుంది... కానీ ఇక్కడ పక్కవాడికి కూడా తగలడం విచిత్రం. సీఎం సభలలో కరెంటు పోతే వెంటనే భద్రతా సిబ్బంది సీఎం చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడతారు. కానీ విజయవాడలో అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాయి విసిరి హత్యాయత్నం చేసింది వీడే అని ఒక అమాయకుడ్ని చూపించి, అతడ్ని కూడా కోడికత్తి శ్రీనులా జైల్లో మగ్గిపోయేలా చేస్తారు" అంటూ చింతమనేని ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Stone Attack On Jagan
Chinthamaneni Prabhakar
YS Vijayamma
TDP
YSRCP

More Telugu News