KCR: 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్త పాలనా?: రేవంత్ సర్కారుపై కేసీఆర్ ఫైర్

KCR take a dig at Revanth Reddy govt
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించి, పలు ప్రాంతాల్లో పంట పొలాలను సందర్శించారు. నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిన పంట చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించారు. 

అనంతరం కేసీఆర్ స్పందిస్తూ, మూడు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించానని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పంట  నష్టంతో కన్నీరుమున్నీరవుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశామని రైతులు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని వారు బాధపడుతున్నారని వివరించారు. 

100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో ఇంత దుర్భర పరిస్థితి చూస్తానని అనుకోలేదని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24×7 విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. ఆనాడు కరెంట్ పోతే వార్త... ఈనాడు కరెంట్ ఉంటే వార్త అని వ్యాఖ్యానించారు. 

రైతులకు బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో నాడు కరెంట్ పోకుండా విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దామని అన్నారు. నేషనల్ పవర్ గ్రిడ్ కు హైదరాబాద్ ను అనుసంధానించామని, హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామని వివరించారు. అలాంటిది, ఇప్పుడు మళ్లీ పవర్ జనరేటర్లు, ఇన్వర్టర్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. 

ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మిషన్ భగీరథను పూర్తి చేశామని కేసీఆర్ వెల్లడించారు. కానీ ఇప్పుడు మిషన్ భగీరథను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని, పవర్ ఫెయిల్యూర్ కు ఎవరిది బాధ్యత? అని నిలదీశారు. 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమైన పాలనా? ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబరు 9న చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో ఎండిన పంటలకు పరిహారంగా ఎకరాకు.25 వేలు చెల్లించాల్సిందేని అన్నారు. 

సమస్యలపై ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని, ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజవకర్గాల్లో బీఆర్ఎస్ దీక్షలు చేపడుతుందని కార్యాచరణ ప్రకటించారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికీ, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Go Back to Shorts
KCR
Revanth Reddy
BRS
Congress
Telangana

More Telugu News