Revanth Reddy: కవిత అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy responded on Kavitha arrest
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై కేసీఆర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మౌనంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి మౌనం వెనుక వ్యూహం ఉందన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని... నిన్న మాత్రం ఈడీ, మోదీ ఒకేసారి వచ్చారన్నారు.

బీజేపీ, కేసీఆర్ కుటుంబం కలిసి మద్యం కుంభకోణాన్ని సీరియల్‌లా నడిపించాయని మండిపడ్డారు. కవిత అరెస్ట్ కేవలం బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం జరిగిందని... ఎందుకో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్న సమయంలో తమను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అరెస్ట్ కేవలం ఎన్నికల స్టంట్ అన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana
K Kavitha
Narendra Modi

More Telugu News