ఇవాళ నేను హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభాలే జరిగాయి: చంద్రబాబు

Chandrababu said he had all good things today
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, దాచేపల్లిలో ఉరకలెత్తుతున్న ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుందని అన్నారు. యువత, మహిళలు ఏ వైపు ఉంటే ఆ వైపుదే గెలుపు... టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు... ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతాం అని స్పష్టం చేశారు. 

"ఇవాళ నేను హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభపరిణామాలే జరిగాయి. మొదట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. అక్కడ్నించి నెల్లూరు వెళితే సాక్షాత్తు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు.

ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు... స్వలాభం కోసం కాదు... నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. లావు శ్రీకృష్ణదేవరాయలును పార్టీలో చేర్చుకునే ముందే ఐవీఆర్ఎస్ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ సందేశం పంపాను. ఈయన మంచివాడా, చెడ్డవాడా... ఎలాంటి వాడు అని అడిగాను. మంచివాడు అని మీరందరూ నాకు బ్రహ్మాండంగా సమాధానం పంపారు. లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడే గెలిచాడు. 

వైసీపీలో సీటు దక్కాలంటే చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టాలి. తిడితేనే సీటు ఇస్తాం అని చెప్పేసరికి... నీ సీటు వద్దు, ఏమీ వద్దు అని వీళ్లు బయటికి వచ్చేశారు. మంచివాళ్లు వీళ్లందరూ. అందుకే నేను వీళ్లకు స్వాగతం పలికాను. అందుకే రా కదలిరా అని పిలుపునిచ్చాను" అని వివరించారు. 

లావు శ్రీకృష్ణదేవరాయలు వరికపూడిసెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చాడని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు.
Go Back to Shorts
Chandrababu
Raa Kadali Raa
Dachepalli
Lavu Sri Krishna Devarayalu
TDP
Narasaraopet

More Telugu News