మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. 21 శునకాల కాల్చివేత.. రంగంలోకి పోలీసులు

21 Stray Dogs Shot Dead In Mahbubnagar District Ponnakal Village
  • నాటుతుపాకులతో దుండగుల స్వైరవిహారం
  • తొలుత విషమిచ్చి ఆపై అతి సమీపం నుంచి శునకాలపై కాల్పులు
  • నిందితులపై ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసులు నమోదు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో జరిగిందీ ఘటన.

ఆయుధాలు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు ఈ మారణహోమానికి తెగబడ్డారు. వారి కాల్పుల్లో మరికొన్ని శునకాలకు గాయాలయ్యాయి. కాల్పుల్లో మరణించిన శునకాలకు పశుసంరక్షణశాఖ పోస్టుమార్టం నిర్వహించింది. అడ్డకల్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. శునకాలకు తొలుత విషం పెట్టి ఆ తర్వాత అతి సమీపం నుంచి కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దుండగులు ఉపయోగించినవి నాటు తుపాకులు అయి ఉంటాయని పేర్కొన్నారు.

ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు బిగించాలని అధికారులు యోచిస్తున్నారు. శునకాల కాల్చివేతకు గల కారణంపై ఆరా తీస్తున్నారు. అయితే, ఇదే ఘటనలో చనిపోయిన రెండు శునకాల శరీరాలపై ఎలాంటి తుపాకి గాయాలు లేకపోవడంతో అవి విష ప్రయోగం వల్ల చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
Stray Dogs
Mahbubnagar District
Ponnakal
Crime News

More Telugu News