Nitish Kumar: బీహార్‌ అసెంబ్లీలో బలం నిరూపించుకున్న సీఎం నితీశ్ కుమార్

Nitish Kumar wins floor test in bihar floor test
  • 130-0తో విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
  • శాసన సభ నుంచి వాకౌట్ చేసిన ఆర్జేడీ
  • ఆర్జేడీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నితీశ్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 130-0తో నెగ్గారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ శాసన సభ నుంచి వాకౌట్ చేసింది. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ 130 మంది మద్దతు పలికారు. అసెంబ్లీ సమయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ కూడా ఎన్డీయే వైపు మొగ్గారు.

నితీశ్ కుమార్ కొన్ని రోజుల క్రితం మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చారు. నితీశ్ ఎన్డీయేతో జతకట్టి... తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. విశ్వాస పరీక్ష సమయంలో చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్... ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. తాను ప్రారంభించిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 2005కు ముందు ఆర్జేడీ ప్రభుత్వం పదిహేనేళ్లు పాలించిందని, కానీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.

తనకంటే ముందు పాలించిన ఆర్జేడీ ప్రభుత్వ పాలన తీరు... తన పాలన తీరు ప్రజల కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఆర్జేడీ హయాంలో మతఘర్షణలు జరిగాయని... కానీ తాను వచ్చాక అలాంటివేమీ లేవన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సుదీర్ఘ కాలంలో ప్రజలకు ఎంతో చేశానన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. శాంతిభద్రతల సమస్య బాగా తగ్గిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే మహిళలు రాత్రిపూట కూడా ధైర్యంగా తిరగగలుగుతున్నారన్నారు.
Nitish Kumar
Bihar
BJP

More Telugu News