ప్రైవేట్ జెట్ లో ప్రయాణించిన సీఎం సిద్ధరామయ్య... మండిపడుతున్న బీజేపీ

BJP fires on Karnataka CM Siddaramaiah travelled in private jet
  • ఇటీవల ఓ చార్టర్డ్ విమానంలో ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం
  • రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సీఎం విలాసవంత జీవనం గడుపుతున్నారన్న బీజేపీ
  • ప్రజలను హేళన చేయడమేనని విమర్శలు
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రైవేట్ జెట్ విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆ విమానంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కూడా ఉన్నారు. సీఎం తదితరులు విమానంలో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కర్ణాటక విపక్షం బీజేపీ మండిపడుతోంది. 

రాష్ట్రం ఓవైపు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ విమర్శించింది. 

"కరవు పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లయింది. కనీసం రోడ్లపై గుంతలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు" అంటూ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో ధ్వజమెత్తింది. 

అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య, అతని సన్నిహితుడు జమీర్ అహ్మద్ ఖాన్ విలాసాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని విమర్శించింది. ముఖ్యమంత్రి ఖుషీ ఖుషీగా ప్రైవేట్ విమానంలో ప్రయాణించడం రాష్ట్ర ప్రజలను హేళన చేయడమేనని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ఈ వీడియోనే నిదర్శనమని పేర్కొంది.
Go Back to Shorts
Siddaramaiah
Private Jet
Congress
Chief Minister
BJP
Karnataka

More Telugu News