యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Ex CM KCR discharged from Yashoda hospital
  • ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి చికిత్స
  • నందినగర్ లోని నివాసానికి బయల్దేరిన మాజీ సీఎం
  • ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. 

ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, నాగార్జున తదితరులు పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన యశోదా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయల్దేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
Go Back to Shorts
KCR
BRS
Hospital
Discharge

More Telugu News