Speaker: మరికాసేపట్లో స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్
తెలంగాణ శాసన సభ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం గడ్డం ప్రసాద్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసాద్ తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎంపిక ఏకగ్రీవమే కానుంది. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటరీ సోమవారమే నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి నేటి సాయంత్రం 5 గంటలతో నామినేషన్ గడువు ముగియనుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ఆయన స్పీకర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.