జైస్వాల్ నుంచి రింకూ వరకు అందరూ బాదుడే... ఆసీస్ పై టీమిండియా భారీ స్కోరు
- టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20
- తిరువనంతపురంలో మ్యాచ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు
- అర్ధసెంచరీలతో అలరించిన జైస్వాల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్
- చివర్లో రింకూ సింగ్ మెరుపుదాడి
ముఖ్యంగా, జైస్వాల్, గైక్వాడ్ జోడీ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 77 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఆసీస్ కొత్త బంతి బౌలర్లను చీల్చిచెండాడిన జైస్వాల్ కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు నమోదు చేశాడు.
ఇషాన్ కిషన్ సైతం ధాటిగా ఆడడంతో టీమిండియా స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కిషన్ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చీ రావడంతోనే సిక్స్ తో పరుగులు వేట ప్రారంభించాడు. సూర్య 10 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
చివర్లో రింకూ సింగ్ దడదడలాడించాడు. రింకూ కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 4 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. మరో ఎండ్ లో తిలక్ వర్మ 2 బంతుల్లో 1 సిక్స్ సాయంతో 7 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో టాపార్డర్ బ్యాటర్లలో ప్రతి ఒక్కరూ సిక్సులు కొట్టడం విశేషం.