CPI Ramakrishna: చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ

CPI Ramakrishna responds on KTR comments on Chandrababu arrest
  • కేసీఆర్ అతితెలివితో, మదంతో వ్యహరిస్తున్నారని ఆగ్రహం
  • పేరు బీఆర్‌ఎస్‌గా మారినా, బుద్ధి మాత్రం మారలేదని విమర్శ 
  • హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు
ముఖ్యమంత్రి కేసీఆర్ అతితెలివితో... మదంతో వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా నేడు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పోరాటాల గడ్డ అని, ప్రజలు కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారింది కానీ బుద్ధి మాత్రం మారలేదన్నారు.

 నరేంద్రమోదీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటే అన్నారు. ఈ ముగ్గురూ అహంకారంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో కళ్లు తెరుస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా పోటీ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
CPI Ramakrishna
Congress
Chandrababu
KTR
KCR
Telangana Assembly Election

More Telugu News