మేమేం తప్పులే చేయలేదని చెప్పడం లేదు కానీ... ప్రజలు గులిగినా కారుకే ఓటేస్తారు: కేటీఆర్ ధీమా
- కాంగ్రెస్ హవా సోషల్ మీడియాలోనే కనిపిస్తోందన్న మంత్రి కేటీఆర్
- అధికార యంత్రాంగం సరిగ్గా పని చేయకుంటేనే సామాన్యుడు సీఎంను కలిసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్య
- ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.. కానీ గెలుస్తామన్న కేటీఆర్
ఈ తొమ్మిదేళ్లలో మేమేమీ తప్పులు చేయలేదని చెప్పనని, మేమేమీ దైవాంశ సంభూతులం కాదన్నారు. ప్రధాని మోదీతో పోల్చుకుంటే కేసీఆర్ అత్యంత ప్రజాస్వామికవాది అన్నారు. ఓ సీఎంను సామాన్యుడు కలవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అలా కలవాల్సి వస్తే అధికార యంత్రాంగం సరిగ్గా పని చేయనట్లే అన్నారు. పార్టీలో నుంచి బయటకు వెళ్లిన వారే కేసీఆర్ను విమర్శిస్తారన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారికి ఆయన దెయ్యంలా కనిపిస్తారన్నారు. కేసీఆర్ ఎవరినీ కలవకపోయినా పనులు ఆగేది ఉండదన్నారు. సీఎం ఎవరి మాట వినరు అనే దాంట్లో వాస్తవం లేదన్నారు. తాము మరోసారి గెలిచి దక్షిణాదిన హ్యాట్రిక్ కొడతామన్నారు.
తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నందున ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వుండడం సహజమే అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరిమితికి మించి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అదే సమయంలో కేసీఆర్ తొలిసారి గెలవగానే ఎమ్మెల్యేలు తప్పులు చేయకుండా అదుపులో పెట్టారన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న ఆగ్రహం ప్రజల్లో కనిపించిందని, అందుకే ఓడిపోయారని, కానీ ఇక్కడ బీఆర్ఎస్పై అలాంటిదేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు గులిగినప్పటికీ (సణుగుడు) ఓట్లు మాత్రం కారుపైనే పడతాయన్నారు.