Rohit Sharma: మేం అనుకున్న గోల్ ఇదే: రోహిత్ శర్మ

Rohit Sharma talks about Team India performance in World Cup
  • వరల్డ్ కప్ లో శ్రీలంకపై భారీ విజయం సాధించిన టీమిండియా
  • అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు
  • తదుపరి లక్ష్యం ఫైనల్ చేరడమేనన్న రోహిత్ శర్మ

శ్రీలంకపై అతి భారీ విజయం సాధించి వరల్డ్ కప్ సెమీస్ లోకి టీమిండియా దర్జాగా అడుగుపెట్టింది. ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ముగిశాక టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ, తాము టోర్నీలో అధికారికంగా సెమీస్ లో ప్రవేశించామన్న విషయం తెలిసి ఎంతో ఆనందం కలిగిందని చెప్పాడు. 

టీమిండియా వరల్డ్ కప్ ప్రస్థానం చెన్నైలో షురూ అయిందని, ఇప్పటివరకు ఓ జట్టుగా రాణించామని తెలిపాడు. ఈ మెగా టోర్నీలో తొలుత తగినన్ని పాయింట్లతో అర్హత పొంది సెమీస్ చేరడాన్ని గోల్ గా నిర్దేశించుకున్నామని, ఆ తర్వాత ఫైనల్ చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ శర్మ వివరించాడు. తాము ఇప్పటివరకు 7 మ్యాచ్ లలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రాణించి, జట్టు జైత్రయాత్రకు సాయపడ్డారని వెల్లడించాడు. 

వాంఖెడే పిచ్ పై 350 పరుగులు అంటే మంచి స్కోరు సాధించినట్టేనని తెలిపాడు. ఈ ఘనత బ్యాట్స్ మన్లకు చెందుతుందని, ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించారని హిట్ మ్యాన్ కొనియాడాడు. ఇక, తమ తదుపరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉందని, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముందని తెలిపాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ప్రేక్షకులకు కనులవిందు ఖాయమని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News