Daggubati Purandeswari: పురందేశ్వరి గారూ... లోకేశ్‌తో కలిసి మీ ఆయన మీద అమిత్ షాకి ఫిర్యాదు చేశారా?: విజయసాయిరెడ్డి చురకలు

  • పురందేశ్వరి నేరానికి మద్దతిస్తారా? లేక చట్టానికి ఇస్తారా? అని ప్రశ్న
  • చంద్రబాబు లాయర్లు 17-ఏ వర్తిస్తుందని చెబుతున్నారు తప్ప తప్పు చేయలేదని అనడం లేదన్న విజయసాయిరెడ్డి
  • అవినీతి బాగోతంలో ఎటువైపు నిల్చోవాలో బీజేపీ తేల్చుకోవాలని సూచన
  • మీ భర్త రాసిన పుస్తకాన్ని అమిత్ షాకు ఇచ్చారా? అని పురందేశ్వరిపై సెటైర్
VijayaSaiReddy satires on Daggubati Purandeswari

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా పక్కనే పురందేశ్వరి కూడా ఉన్నారు. దీంతో వైసీపీ ఆమెపై విరుచుకుపడుతోంది. తాజాగా విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మరోసారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు నాలుగు ప్రశ్నలు సంధించారు.

- 'పురంధేశ్వరి గారు! బాబు అవినీతికి శిక్షపడాలి. బాబు అవినీతికి ఆధారాలన్నీ చూపిస్తూ అరెస్టు జరిగింది. బాబు అవినీతిని రాష్ట్ర సీఐడీ, కేంద్ర ఈడీ, కేంద్ర ఐటీ నిర్ధారించాయి. మరి అలాంటప్పుడు బాబుకు మీ మద్దతు అంటే దాని అర్థం ఏమిటి? మీది నేరానికి మద్దతా... లేక చట్టానికి మద్దతా?

- చంద్రబాబుకు 17–ఏ సెక్షన్‌ వర్తిస్తుందని... ఆ సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ గారి అనుమతి తీసుకునే అరెస్టు చేయాలని టీడీపీ అధినేత లాయర్లు వాదిస్తున్నారు తప్ప, బాబు ఏ నేరం చేయలేదని... ఏ విచారణకైనా సిద్ధమని మాట వరసకు కూడా అనటం లేదు! 

- ఇలాంటి అవినీతి బాగోతంలో మీరంతా మీ కుటుంబంగా, బాబు జనతా పార్టీగా చంద్రబాబు వైపు నిలబడ్డారు! మరి ఈ అవినీతి బాగోతంలో తాము ఎటువైపు నిలబడాలన్నది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి! 

- మరో విషయం కూడా... చంద్రబాబు అవినీతి గురించి, దుర్మార్గాల గురించి మీ భర్త  దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో రాసిన 'ఒక చరిత్ర కొన్ని నిజాలు' అన్న పుస్తకాన్ని అమిత్‌ షా గారికి ఇచ్చారా? లేక ఆ పుస్తకం మీద, మీ ఆయన మీద కూడా మీరు, లోకేశ్‌ కలిసి అమిత్‌షా గారికి ఫిర్యాదు చేశారా? అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి!' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

'జాతీయ పార్టీ అయిన బీజేపీని 'బావ' సారూప్య పార్టీగా మార్చిన రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరి గారు! అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరవాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్‌ విధించింది. బాబు అరెస్టు, రిమాండ్‌ సరికాదన్న వాదనల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి! 

- సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌లు సిద్ధార్థ్‌ లూధ్రా, హరీష్‌ సాల్వే టీడీపీ అధినేత కోసం చేసిన వాదనల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి కాబట్టి... 'బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌' అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు. 

- ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని మీరే అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరఫున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గారిని కలిశారు. ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా.. మీ టాప్‌ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు!' అని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

  • Loading...

More Telugu News