Vande Bharat: వందే భారత్ కు ఆరెంజ్ కలర్.. పాలిటిక్స్ కాదు సైన్స్: రైల్వే మంత్రి

On orange color Vande Bharat trains Railway Minister says no politics only science
  • శాస్త్రీయమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసినట్టు స్పష్టీకరణ
  • మనుషుల కంటికి ఎల్లో, ఆరెంజ్ మెరుగ్గా కనిపిస్తాయని వెల్లడి
  • కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన రైల్వే మంత్రి
వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి స్పందించారు. కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. 

‘‘మానవుల కళ్లకు రెండు రంగులు ఎంతో చక్కగా కనిపిస్తాయి. అవి ఎల్లో, ఆరెంజ్. మనుషుల కంటి నుంచి చూస్తే ఎల్లో, ఆరెంజ్ ఎంతో మెరుగైన రంగులు అవుతాయి. దీని వెనుక రాజకీయాలు లేవు. నూరు శాతం శాస్త్రీయమైన ఆలోచనే ఉంది’’ అని వైష్ణవ్ వివరించారు. విమానాల్లో బ్లాక్ బాక్స్ ను ఉపయోగించడం, ఓడలకు ఆరెంజ్ కలర్ వేయడం వెనుక ఇవే కారణాలను పేర్కొన్నారు. జాతీయ విపత్తు స్పందన దళం వినియోగించే రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లకు సైతం ఆరెంజ్ కలర్ ఉంటుందని గుర్తు చేశారు. కాసరగోడ్-తిరువనంతపురం మార్గంలో వందేభారత్ ఆరెంజ్ రంగు రైలును రైల్వే శాఖ గత నెల 24న ప్రారంభించడం గమనార్హం.
Vande Bharat
train
Railway Minister
orange color
science

More Telugu News