Muralimohan: చంద్రబాబు భద్రతకు ముప్పు ఉంది... అధిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది: మురళీమోహన్

Muralimohan talks about Chandrababu issue
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడం పట్ల మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ స్పందించారు. తాను గతంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశానని, తనకు అక్కడి వివరాలు ఏ టు జెడ్ తెలుసని అన్నారు. సెంట్రల్ జైలు గురించి కూడా తెలుసని చెప్పారు. 

రాజమండ్రి జైలులో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ఉందని మురళీమోహన్ వెల్లడించారు. అక్కడి ఖైదీలతో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయించారని, నేత పనులు, వెల్డింగ్ పనులు, ఐరన్ వర్క్స్, బీరువాలు, స్కూలు బెంచీల తయారీలోనూ ఖైదీలకు శిక్షణ ఇచ్చారని వివరించారు. ఇక్కడి ఖైదీలకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కార్యక్రమం అమలు చేస్తున్నారని, వారు సొంతంగా సంపాదించుకునేలా వృత్తిపనులు నేర్పిస్తున్నారని మురళీమోహన్ తెలిపారు. 

స్కిల్ డెవలప్ మెంట్ ఇలా ఎంతోమందికి ఉపయోగపడుతోందని అన్నారు. గతం వారం రోజులుగా పేపర్లలో చూస్తే... మా పిల్లలు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కారణంగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారని వారి తల్లిదండ్రులు చెబుతుండడం చూడొచ్చని మురళీమోహన్ వివరించారు. దాని వల్ల ఎంత లబ్ది పొందారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 

చివరి వరకు నిలబడేవి నీతి, నిజాయతీ మాత్రమేనని, రేపు ప్రజల తీర్పు తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండం పట్ల కూడా మురళీమోహన్ స్పందించారు. జైళ్లలో కూడా హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయని, జైల్లో చంపేయడం పెద్ద విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు అధిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ జైల్లోకి చంద్రబాబు భద్రతా సిబ్బందిని అనుమతించరని, రేపు ఆయనకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మురళీమోహన్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
Muralimohan
Chandrababu
Arrest
Rajahmundry Central Jail
TDP
Andhra Pradesh

More Telugu News