Vijay Mallya: మాల్యా చేజారిన ప్రతీ కంపెనీ బంగారమే

Meet brothers who bought Vijay Mallya firm and made it Rs 68000 crore market leader
  • ఎయిర్ లైన్స్ వ్యాపారం కోసం లిక్కర్ కంపెనీల విక్రయం
  • చిన్న పెయింట్స్ కంపెనీని వదిలించుకున్న మాల్యా
  • ఇప్పుడు అది రంగుల పరిశ్రమలో రెండో దిగ్గజం
విధిరాతను ఎవరూ మార్చలేరని అంటుంటారు. అందుకు నిదర్శనాలు కూడా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అటువంటిదే. భారత లిక్కర్ (ఆల్కహాల్/మద్యం) పరిశ్రమ దిగ్గజంగా చెప్పుకునే విజయ్ మాల్యా గురించి తెలిసే ఉంటుంది. యూబీ గ్రూపు సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరించి, దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మాల్యా ఎయిర్ లైన్స్ పరిశ్రమలోకి అడుగు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. 

ఎయిర్ లైన్స్ స్థాపించడమే మాల్యా చేసిన అతి పెద్ద తప్పు అని మరో ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారీగా అప్పుల్లోకి కూరుకుపోవడంతో యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీలను డియాజియో గ్రూప్ నకు మాల్యా విక్రయించుకోవాల్సి వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించకుండా ఆయన విదేశానికి చెక్కేశారు. 

మాల్యా విక్రయించిన యూబీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ నేడు రూ.1.15 లక్షల కోట్లు. వీటిని అమ్ముకోకుండా ఉంటే మాల్యా నేడు రూ.లక్ష కోట్లకు అధిపతిగా కొనసాగే వారు. కానీ విధి ఆయన్ని  వెంటాడింది. అంతేకాదు 1990లో విజయ్ మాల్యా యూబీ గ్రూపు నుంచి అమ్మేసుకున్న చిన్న పెయింట్స్ కంపెనీ నేడు ఆ రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అదే బెర్జర్ పెయింట్స్.

పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన కులదీప్ సింగ్ దింగ్రా, గుర్బచన్ సింగ్ దింగ్రా సోదరులు మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ నుంచి బెర్జర్ పెయింట్స్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసే నాటికి అది చాలా చిన్న కంపెనీగా ఉంది. కానీ నేడు అదే కంపెనీ మార్కెట్ విలువ రూ.68,000 కోట్లు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే అందుకు ఒక నిదర్శనం విజయ్ మాల్యా అని చెప్పుకోవాలి.
Vijay Mallya
berger paints
sold

More Telugu News