Telsa: వీలైనంత త్వరలోనే భారత్‌కు ‘టెస్లా’ కార్లు.. ధర ఇంత ఉండొచ్చట!

telsa in talks with indian govt to set up factory in country
షార్ట్స్‌లో చూడండి
టెస్లా.. ఎలక్ట్రానిక్‌ కార్ల దిగ్గజ సంస్థ. ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ (ఈవీ) తయారీలో, అమ్మకాల్లో తిరుగులేని కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో తన కార్లను విక్రయిస్తోంది. అయితే భారత మార్కెట్‌లోకి మాత్రం ఇప్పటిదాకా ప్రవేశించలేదు. పన్నులు, తయారీ విషయంలో కేంద్రంతో చర్చలు ఫలించక.. టెస్లా మన మార్కెట్‌లోకి రాలేకపోయింది. ఇటీవలి ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 

ఈ నేపథ్యంలో భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు ప్రారంభించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఏటా ఐదు లక్షల ఈవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ను మన దేశంలో ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన కార్లను ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలకు భారత్‌ నుంచే ఎగుమతి చేయాలని ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ ప్రణాళికలు చేస్తోందట. ఇక భారత్‌లో ఈ విద్యుత్తు వాహనాల ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై టెస్లా గానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.

గత నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే. తర్వాత మస్క్‌ మాట్లాడుతూ.. భారత్‌లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని, త్వరలోనే దీనిపై ప్రకటన ఉండే అవకాశముందని తెలిపారు. ఈ భేటీ తర్వాతే భారత్‌ ప్రభుత్వంతో టెస్లా సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Telsa
Elon Musk
Electric Vehicles
Narendra Modi
Indian market
EVs
telsa factory

More Telugu News