Rains: ఏపీకి రెండ్రోజుల పాటు వర్ష సూచన
ఈసారి ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది. కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, దేశంలో వడగాలుల ప్రభావం దాదాపు తగ్గిపోయినట్టేనని, వచ్చే 5 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వివరించింది.