Odisha: ఒడిశా రైలు ప్రమాదం.. రెండు రోజుల తర్వాత చెట్లపొదల నుంచి బయటపడ్డ వ్యక్తి!

  • ప్రమాద స్థలం సమీపంలోని చెట్ల పొదల్లో సజీవంగా ప్రమాద బాధితుడు
  • సాయం కోసం బలహీనంగా ఆర్తనాదాలు
  • ఓ పోలీసు వినడంతో ఆసుపత్రికి తరలింపు
Odisha train accident 48 hours later Assam man found alive under rubble

సహాయం కోరుతూ ఎక్కడి నుంచో పిలుపు వినిపించింది. గొంతు చాలా స్వల్ప స్థాయిలో ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ పిలుపునకు సమీపంలో ఉన్న ఓ పోలీసు వెతకడం మొదలు పెట్టాడు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ప్రాంతం అది. పొదల చాటున ఓ వ్యక్తి పడిపోయి కనిపించాడు. నిజానికి అప్పటి వరకు ఆ ప్రాంతాన్ని సహాయ బలగాలు పరిశీలించలేదు. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రాణాలతో అక్కడ కనిపించడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. 

స్వచ్ఛంద కార్యకర్తలతో కలసి బాధితుడిని సోరో కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడ్ని అసోమ్ రాష్ట్రానికి చెందిన దులాల్ మజుందార్ (35)గా గుర్తించారు. తన రాష్ట్రానికే చెందిన మరో ఐదుగురితో కలసి అతడు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో జనరల్ బోగీలో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తన తోటి వారు బతికే ఉన్నారా? ఏమయ్యారో కూడా అతడికి తెలియదని చెప్పాడు. 

ప్రమాదం అనంతరం అతడు ఎగిరి వచ్చి చెట్ల పొదల్లో పడిపోయినట్టు భావిస్తున్నారు. తలకు గాయాలై, మాటల మధ్య పొంతన లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. అతడ్ని ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచారు. మజుందార్ మాదిరే మరెవరైనా బాధితులు చెట్ల పొదల చాటున జీవించి ఉన్నారేమోనని అక్కడ మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News