Kolkata: కోల్‌కతా-దోహా విమానంలో బాంబు ఉందన్న ప్రయాణికుడు.. ప్రయాణికులను దించేసి స్పిఫర్ డాగ్స్‌తో తనిఖీ

  • కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • విమానంలో బాంబు ఉందని ఫోన్ వచ్చిందన్న ప్రయాణికుడు
  • తన కుమారుడికి మానసిక ఆరోగ్యం బాగోలేదన్న తండ్రి
Doha Bound flight evacuated after man triggers bomb scare

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహా వెళ్లాల్సిన ఖతర్ ఎయిర్‌లైన్ విమానానికి బాంబు బెదిరింపు ఎదురైంది. దీంతో అందులోని సిబ్బంది, ప్రయాణికులు సహా 186 మందిని దించేసి తనిఖీలు చేపట్టారు. విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. విమానంలో బాంబు ఉన్నట్టు తనకు సమాచారం అందిందని ఓ ప్రయాణికుడు చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది సీఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందించారు.

ఆ వెంటనే విమానంలోని ప్రయాణికులందరినీ కిందికి దించి తనిఖీలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్‌తో అణువణువు గాలించారు. బాంబు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉన్నట్టు చెప్పిన ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నించారు. విమానంలో బాంబు ఉన్నట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. అయితే, అతడి తండ్రి మాత్రం తన కుమారుడి మానసిక ఆరోగ్యం బాగోలేదని చెబుతూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు చూపించాడు. దీంతో విమానం 9 గంటలకు దోహా బయలుదేరింది.

More Telugu News