TDP Mahanadu: ‘మహానాడు మెతుకు’ ముట్టని పోలీసులు.. సొంతంగా భోజనాల ఏర్పాటు!

  • మహానాడు బందోబస్తులో పాల్గొన్న పోలీసుల కోసం ఉన్నతాధికారుల ప్రత్యేక భోజన ఏర్పాట్లు
  • వంట మేస్త్రీలతో టిఫిన్, భోజనాలు సిద్ధం చేయించి ఇచ్చిన వైనం
  • మహానాడులో సిద్ధం చేసిన భోజనంవైపు కన్నెత్తి చూడని పోలీసులు
  • మజ్జిగ, మంచినీళ్లు అయినా తాగండని కార్యకర్తలు కోరినా సున్నితంగా తిరస్కరణ
Department made arrangments for food for police personnel deployed at Mahanadu in Rajamundry

టీడీపీ మహానాడు బందోబస్తుకు హాజరైన పోలీసులు తమ భోజన ఏర్పాట్లు తామే స్వయంగా చేసుకున్నారు. మహానాడులో సిద్ధం చేసిన ఆహారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం మజ్జిగ, మంచినీళ్లయినా తాగండని కొందరు కార్యకర్తలు సూచించినా వారు సున్నితంగా తిరస్కరించారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకునే పోలీసులు తమ భోజన ఏర్పాట్లు తామే చేసుకున్నారు. రాజమండ్రిలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడుకు సుమారు 1500 మంది పోలీసులు భద్రత కల్పించారు. 
 
ఇక బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల భోజనాల కోసం ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనాలను సమకూర్చారు. భీమవరం నుంచి వంట మేస్త్రీలను రప్పించి శాకాహార, మాంసాహార వంటకాలను సిద్ధం చేయించారు. వాటిని ప్యాకెట్లలో నింపి వాహనాల్లో మహానాడుకు తరలించారు. మజ్జిగ ప్యాకెట్లను కూడా రెడీ చేశారు.

More Telugu News