Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. కారు కింద నలిగి మూడేళ్ల బాలిక దుర్మరణం

  • బీఎన్‌రెడ్డి నగర్ సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో బుధవారం వెలుగు చూసిన ఘటన
  • నిద్రపోతున్న పాపను(3) అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టి వెళ్లిన నిర్మాణ కార్మికురాలు
  • చిన్నారిని చూడక కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించిన అపార్ట్‌మెంట్ వాసి
  • కారు చక్రం కింద నలిగి మరణించిన చిన్నారి
  • దారుణ దృశ్యం చూసి గుండెలవిసేలా రోదించిన తల్లి 
Girl sleeping in parking lot gets crushed undercar in hyderabad

హైదరాబాద్‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలంలో నిద్రపోతున్న ఓ మూడేళ్ల చిన్నారి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పొరపాటు కారణంగా కారు టైర్ కింద నలిగి మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన రాజు, కవిత దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. బీఎన్‌రెడ్డి నగర్ సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఏడేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. సమీప లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్టుమెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఆ దంపతులు శ్లాబు పనులు చేస్తున్నారు. 

బుధవారం మధ్యాహ్నం కవిత నిద్రపోతున్న తన కూతుర్ని అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టి వెళ్లింది. అదే అపార్ట్‌మెంటులో నివాసం ఉండే హరిరామకృష్ణ తన కారుతో లోపలికి వచ్చారు. పార్కింగ్ స్థలంలో చిన్నారి పడుకుని ఉన్న విషయాన్ని గమనించక కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు ముందు చక్రం కింద పాప తల నలిగిపోవడంతో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. 

ఈ దారుణ దృశ్యం చూసి కవిత నిర్ఘాంతపోయింది. గుండెలవిసేలా రోదిస్తూ స్థానికుల సాయంతో పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News