హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల

MP Chamala fires on BRS leaders
  • కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న చామల
  • కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ
  • దోపిడీకి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్న కేటీఆర్, హరీశ్ రావులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కోర్టు ఎక్కడా ఎవరికీ 'క్లీన్ చిట్' ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం కట్టారని, తెలంగాణ సొమ్మును నాశనం చేశారని మండిపడ్డారు. కేవలం రెండేళ్లకే ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుపట్టలేదని, కేవలం నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవడంపై మాత్రమే అభ్యంతరపెట్టిందని ఆయన వివరించారు. దీనికే సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గతంలో '24 గంటల్లో సినిమా చూపిస్తాం' అన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని ఆరోపిస్తూ, వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోతే కాళేశ్వరం కూలిపోయినట్టేనని, నాణ్యత పాటించకుండా కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని విమర్శించారు.
Go Back to Shorts
Chamala Kiran
congress
KTR
Harish Rao
KCR
BRS

More Telugu News