Ox: ఊళ్లోకి వచ్చిన సింహాలను పరుగులు తీయించిన ఎద్దు... వీడియో వైరల్

  • గుజరాత్ లోని జునాగఢ్ లో ఊళ్లోకి ప్రవేశించిన సింహాలు
  • ఎద్దు తరుముకుని రావడంతో భయంతో దౌడు తీసిన వైనం
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన ఘటన
Ox ran away the lions entered into the village

వనసీమల మధ్య ఎదురులేని మృగరాజు సింహం. అడవికి రారాజు అనదగ్గ అలాంటి సింహం కూడా అడవి విడిచి ఊళ్లోకి వచ్చి ఓ ఎద్దుకు లోకువైపోయింది. ఒకటి కాదు రెండు కాదు... నాలుగైదు సింహాలు వచ్చినా ఆ ఎద్దు మహా పౌరుషంతో వెంటబడి తరిమింది. ఈ ఘటన గుజరాత్ లోని జునాగఢ్ లో జరిగింది. అక్కడికి దగ్గర్లోనే గిర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇది సింహాలకు నెలవు. అక్కడ్నించి సింహలు తరచుగా సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశిస్తుంటాయి. 

ఆ విధంగానే ఓ సింహాల గుంపు జునాగఢ్ లోకి ప్రవేశించింది. ఎంతో ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న ఆ సింహాలు ఉన్నట్టుండి వెనుదిరిగి పరుగు లంకించుకున్నాయి. ఏంటని చూస్తే... విపరీతమైన ఆవేశంతో దూసుకువచ్చిన ఓ ఎద్దు ఆ సింహాలను దౌడు తీయించింది. ఎద్దు దెబ్బకు ఆ సింహాలు చెల్లాచెదురయ్యాయి.

ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతేకాదు, ఆరుబయట నిద్రిస్తున్న ఓ వ్యక్తి కూడా ఈ వ్యవహారాన్ని తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News