NTR: ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, రాజకీయ ప్రముఖులు

  • హైదరాబాద్‌లో ఈ నెల 20న ఎన్టీఆర్ శత జయంతి సభ
  • కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో సభావేదిక ఏర్పాటు
  • హాజరు కానున్న అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ నాయకులు
  • శత జయంతి కమిటీ కన్వీనర్ వెల్లడి
Cine stars and political leaders from Communist parties and BJP to attend NTR shata jayanthi sabha in Hyderabad

హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ టీడీ జనార్దన రావు గురువారం మీడియాకు తెలిపారు. ఈ నెల 20న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ సభ నిర్వహిస్తారు. 

స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఈ సభకు హాజరవుతారు. కన్నడ సినీ హీరో శివ రాజకుమార్, తెలుగు సినీ ప్రముఖులు వెంకటేశ్, కల్యాణ్ రాం, జయప్రద, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, జీ ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, సుమన్ తదితరులు పాల్గొంటారు. 

ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు జీవిత విశేషాలతో ‘శకపురుషుడు’ పేరుతో ఓ ప్రత్యేక సంచికను కూడా సభలో ఆవిష్కరిస్తారు. ఇక ఎన్టీఆర్ సినీ, జీవిత విశేషాలున్న ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తారు. తొలి సభను శత జయంతి కమిటీ విజయవాడలో నిర్వహించింది. రెండో సభను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై  ఈ సభను విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేసింది.  

NTR

More Telugu News