Hyderabad: మద్యం విషయంలో గొడవ.. విద్యుత్ షాక్ తో భార్యను చంపేసిన భర్త

Man electrocutes sleeping wife after row over drinking
  • డబ్బుల కోసం వేధించడంతో గొడవ పడ్డ భార్య
  • నిద్రిస్తున్న భార్య తలకు విద్యుత్ వైర్ చుట్టి స్విచ్ఛ్ ఆన్ చేసిన భర్త
  • రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ లో దారుణం
మద్యానికి బానిసైన ఓ యువకుడు కట్టుకున్న భార్యకు కరెంట్ షాక్ తగిలేలా చేసి చంపేశాడు. పదిహేనేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మద్యం మత్తులో చంపేసి, ప్రమాదవశాత్తూ జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో మద్యం తాగొద్దని గొడవ చేయడంతోనే ఈ దారుణానికి తెగబడ్డట్లు వెల్లడించాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని కొందుర్గ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. తల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.

కొందుర్గ్ కు చెందిన ఎస్ యాదయ్య 2008లో మమతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత యాదయ్య మద్యానికి బానిసగా మారాడు. రోజూ తాగి వచ్చి గొడవ చేయడం అలవాటుగా మారింది. నిత్యం తాగుతూ ఉండడంతో మమత రోజు కూలీగా మారింది. కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, యాదయ్య తాగి వచ్చి డబ్బుల కోసం భార్యా పిల్లలను వేధిస్తుండేవాడని చుట్టుపక్కల వారు చెప్పారు.

సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో భర్తపై మమత చేయిచేసుకుంది. తర్వాత పిల్లలతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న మమత తలకు యాదయ్య కరెంట్ వైర్ ను చుట్టి, స్విచ్ వేశాడు. దీంతో షాక్ తగిలి మమత చనిపోయింది. అనంతరం ప్రమాదవశాత్తూ షాక్ తగిలి భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
Hyderabad
shadnagar
kodurgh
wife murder

More Telugu News