Nara Lokesh: ​అధికారం కోసం రకరకాల హామీలు ఇచ్చి, ఆ తర్వాత నట్టేట ముంచాడు: లోకేశ్

  • శ్రీశైలం నియోజకవర్గంలో ముగిసిన యువగళం
  • నంద్యాల నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • కొత్తపల్లి శివార్లలో లోకేశ్ కు ఘనస్వాగతం
  • లోకేశ్ ను కలిసిన ఎన్ఎంఆర్/టైమ్ స్కేల్ ఉద్యోగులు
Lokesh take a jibe at CM Jagan

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో 3 రోజుల పాటు విజయవంతంగా సాగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 101వ రోజు కొత్తపల్లి శివార్లలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్ర నంద్యాల పరిధిలోకి ప్రవేశించగానే యువగళానికి జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  జై లోకేశ్... జై తెలుగుదేశం నినాదాలతో యువగళం హోరెత్తింది. 

లోకేశ్ ను కలిసిన ఎన్ఎంఆర్/టైమ్ స్కేల్ ఉద్యోగులు 

శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు శివారు క్యాంపు సైట్ లో కర్నూలు జిల్లా ఎన్ఎంఆర్/టైమ్ స్కేల్ ఉద్యోగులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

"రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఎన్ఎంఆర్/టైం స్కేలు ఉద్యోగులుగా 3 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మా సంఖ్య 10 వేలు ఉండగా, కొందరు అనారోగ్యానికి గురై మరణించారు, మరికొందరు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం 4,365 మంది ఫుల్ టైం, 380 మంది పార్ట్ టైం సేవలందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్, విద్య, అటవీశాఖల్లో పనిచేస్తున్న మా సహచర సిబ్బంది (1993కి పూర్వం పనిచేస్తున్నవారు)ని క్రమబద్ధీకరించారు. 

గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పారు. సర్వీసు క్రమబద్ధీకరణ సకాలంలో జరగకపోవడంతో 30 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ అనారోగ్యానికి గురై మరణించిన సిబ్బంది కుటుంబాలు ఎటువంటి బెనిఫిట్స్ అందక రోడ్డున పడుతున్నారు. 

25-11-1993 నాటికి విధుల్లో ఉండి పదేళ్లు సర్వీసు ఉన్న పార్ట్ టైమ్ సిబ్బందిని క్రమబద్దీకరించాలి. 25-11-1993 నాటికి ముందుగానే నియమితులై సర్వీసు క్రమబద్ధీకరణ కాకుండానే పదవీ విరమణ చేసిన వారి కుటుంబాలకు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి. సర్వీసు క్రమబద్ధీకరణ కాకుండా మరణించిన ఎన్ఎంఆర్/టైం స్కేలు ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలి" అని తమ వినతిపత్రంలో నివేదించారు. 

దీనిపై లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా మోసగించారని ఆరోపించారు. అధికారం కోసం రకరకాల హామీలు ఇచ్చి వంచించిన సీఎం, ఆ తర్వాత అందరినీ నట్టేట ముంచాడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవని లోకేశ్ పేర్కొన్నారు. 

దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్/ టైమ్ స్కేలు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎంఆర్/ టైమ్ స్కేలు ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరికలు

శ్రీశైలం నియోజకవర్గం పార్నెపల్లిలో వైసీపీ సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి నేతృత్వంలో 400 కుటుంబాలు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రాఘవరెడ్డి, మురళీధర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై విసుగుచెంది ఎంతోమంది టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. 

జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు ఎవరు కలిసి వస్తామన్నా టీడీపీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. పార్నెపల్లిలో కొత్తగా పార్టీలో చేరిన నేతలు నియోజకవర్గ ఇన్ చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సీనియర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. 

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1293.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.8 కి.మీ.*

*102వ రోజు (17.5.2023) పాదయాత్ర వివరాలు*

*నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)*

సాయంత్రం

4.00 – మూలమఠం క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – నంద్యాల చెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.

4.45 – ఆత్మకూరు బస్టాండు చౌరస్తాలో స్థానికులతో మాటామంతీ.

5.05 – మహనందేశ్వరస్వామి గుడి వద్ద స్థానికులతో మాటామంతీ.

5.25 – జామియా మసీదు వద్ద ముస్లింలతో సమావేశం.

5.45 – గాంధీ చౌక్ లో స్థానికులతో సమావేశం.

6.00 – కల్పనా సెంటర్ లో బంగారుషాపు యజమానులతో సమావేశం.

6.10 – సాయిబాబాగుడి వద్ద బొందిలి, మంజు పీర్ దర్గా ప్రతినిధులతో సమావేశం.

6.30 – శ్రీనివాస సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

6.40 – రాజ్ థియేటర్ సర్కిల్ లో బహిరంగసభ. యువనేత లోకేశ్ ప్రసంగం.

7.45 – పద్మావతి నగర్ ఆర్చి వద్ద వాల్మీకి సామాజికవర్గీయులతో సమావేశం.

8.05 – టెక్కె మార్కెట్ యార్డు వద్ద మున్సిపల్ వర్కర్లతో సమావేశం.

8.15 – ఎస్ బిఐ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.

8.25 – ఫైర్ స్టేషన్ వద్ద దివ్యాంగులతో సమావేశం.

8.35 – టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో సమావేశం.

8.50 – సాయిబాబానగర్ ఆర్చి వద్ద ఆటోవర్కర్లతో సమావేశం.

9.10 – ఎన్ జిఓ కాలనీలో స్థానికులతో సమావేశం.

10.00 – నూనెపల్లి ఫ్ల్రైఓవర్ వద్ద కార్మికులతో సమావేశం.

10.10 – నేషనల్ సీడ్ కార్పొరేషన్ వద్ద వర్కర్లతో సమావేశం.

11.00 – రైతునగర్ లో చాబోలు గ్రామస్తులతో సమావేశం.

11.40 – యాతం ఫంక్షన్ హాలు వద్ద విడిది కేంద్రంలో బస.

******


More Telugu News