Madhya Pradesh: రెండో భార్యతో గొడవ.. కన్న కొడుకును చంపేసిన తండ్రి

  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం
  • మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి
  • కొడుకు విషయంలో రెండో భార్యతో వివాదం
  • అడ్డు తప్పించుకోవడానికి ఏడేళ్ల పిల్లాడి హత్య
Indore man kills 7 year old son after second wife refuses to keep him

మొదటి భార్యతో కలిగిన సంతానం విషయంలో రెండో భార్యతో గొడవలు జరగడంతో కన్న కొడుకును చంపేశాడో ప్రబుద్ధుడు.. రెండో భార్య కాపురానికి రావడంలేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం జరిగిందీ దారుణం. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. మొదటి భార్యకు, శశిపాల్ ముండేకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు.

అయితే, కొడుకును చూసుకునే విషయంలో శశిపాల్ కు, ఆయన రెండో భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. శశిపాల్ మొదటి భార్య కొడుకు ఉన్నంత వరకూ తాను కాపురానికి రానంటూ తేల్చిచెప్పింది. దీంతో విసిగిపోయిన శశిపాల్.. కన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న శశిపాల్ ముండే కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News