Woman shot dead: గురుద్వారా ఆవరణలో మందు తాగిన మహిళ.. కోపంతో ఆమెను కాల్చిచంపిన వ్యక్తి

  • పాటియాలాలోని గురుద్వారాలో స‌రోవ‌ర్ వ‌ద్ద మద్యం తాగుతూ కనిపించిన ప‌ర్మీంద‌ర్ కౌర్
  • కోపంతో ఊగిపోయిన నిర్మ‌ల్‌జిత్ సింగ్ అనే వ్యక్తి
  • లైసెన్స్ డ్ రివాల్వర్ తో విచక్షణా రహితంగా కాల్పులు
Woman shot dead for consuming alcohol in gurdwara complex in Punjab

పంజాబ్‌లోని ఓ గురుద్వారాలో దారుణం చోటుచేసుకుంది. గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. పాటియాలాలో ఆదివారం సాయంత్రం జ‌రిగిందీ ఘటన. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘‘పాటియాలాలోని దుఖ్ నివారణ్ సాహిబ్ గురుద్వారాలో ఉన్న స‌రోవ‌ర్ (పవిత్ర నీటి కొలను) వ‌ద్ద ఆదివారం సాయంత్రం ప‌ర్మీంద‌ర్ కౌర్ (32) అనే మ‌హిళ మ‌ద్యం సేవించింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు వ్యక్తులు ఆమెను మేనేజర్ ఆఫీసు వద్దకు తీసుకెళ్లాలని భావించారు. అయితే కోపంతో ఊగిపోయిన నిర్మ‌ల్‌జిత్ సింగ్ అనే వ్యక్తి ఆమెపై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు’’ అని పాటియాలా సీనియర్ ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు. 

ఆమెను హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ మ‌రో వ్య‌క్తిని ఆసుపత్రిలో చేర్పించినట్లు వివరించారు. పాటియాలాలోని అర్బ‌న్ ఎస్టేట్ ఫేజ్ 1లో ప‌ర్మీంద‌ర్ కౌర్ నివాసం ఉంటున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

నిర్మల్ జిత్ తరచూ గురుద్వారాకు వస్తుంటాడని, లైసెన్స్ ఉన్న రివాల్వర్ తో కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని అరెస్టు చేశామన్నారు. అత‌నో ప్రాప‌ర్టీ డీల‌ర్ అని, క్రిమిన‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమీలేద‌ని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

More Telugu News