Hyderabad: హైదరాబాదులో బైక్ ను ఢీకొన్న కారు.. టెకీ దుర్మరణం

  • మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో శనివారం రాత్రి ప్రమాదం
  • గూగుల్ మ్యాప్స్ చూస్తూ తప్పుడు మార్గంలో టెకీ ప్రయాణం
  • తప్పు గుర్తించి వెనక్కు మళ్లిన సమయంలో టెకీకి యాక్సిడెంట్
  • చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూసిన టెకీ
  • మ‌ృతుడిని కృష్ణాజిల్లాకు చెందిన ఎంహెచ్ఎస్‌వీఎస్‌ చరణ్‌గా గుర్తింపు
hyderabadi Techie dies in road accident

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం చెందాడు. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్లిన అతడు తప్పుడు మార్గంలో వెళుతున్నట్టు గుర్తించి వెనక్కు మళ్లిన సమయంలో మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబర్ 84 వద్ద శనివారం అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో టెకీ ఎంహెచ్ఎన్‌వీఎస్ చరణ్(22) మరణించాడు. వాహనం వెనక కూర్చున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో అతడు తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం బైకులపై షికారుకు బయలుదేరారు. తొలుత నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశాక వారు ట్యాంక్‌బండ్‌పై సేద తీరారు. ఆ తరువాత గూగుల్‌ మ్యాప్స్ సాయంతో మెహిదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు బయలుదేరారు. వారిలో కొందరు రెండు బైకులపై ముందు వెళ్లిపోయారు. చరణ్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ బైక్‌ను ఎక్స్‌ప్రెస్ వే వైపు మళ్లించాడు. 

ఆ తరువాత దారి తప్పినట్టు గుర్తించి, గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబర్ 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు దిగేందుకు మలుపు తిరిగాడు. ఈ క్రమంలోనే ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్ హౌస్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలు గాయపడిన చరణ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. 

More Telugu News