Yashasvi Jaiswal: ఫాస్టెస్ట్ 50 బాదిన జైస్వాల్ కు జై షా అభినందనలు

  • జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రత్యేక ప్రదర్శనగా పేర్కొన్న జై షా
  • ఆట పట్ల దృఢత్వం, అభిరుచి ఏంటో తెలియజెప్పాడంటూ ట్వీట్
  • భవిష్యత్తులోనూ ఇదే ప్రదర్శన చేయాలన్న ఆకాంక్ష
Jay Shah tweet on Yashasvi Jaiswal sparks selection guaranteed in Indian side rumours

రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. గురువారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బ్యాటుతో చేసిన విధ్వంసం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం 13 బంతుల్లోనే 50 పరుగులు చేసి, ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 రికార్డు రాయడం తెలిసిందే. మొత్తంగా 47 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి, రాజస్థాన్ ను గెలిపించాడు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం స్పందించారు.

‘‘యువకుడి ప్రత్యేక ప్రదర్శన ఇది. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేశాడు. తద్వారా ఆట పట్ల దృఢత్వం, అభిరుచిని తెలియజేశాడు. చరిత్ర సృష్టించినందుకు అభినందనలు. భవిష్యత్తులోనూ ఇలాగే చక్కని ప్రదర్శన కొనసాగించాలి’’ అంటూ జై షా ట్వీట్ చేశారు. జైషా ట్వీట్ ను చూసిన తర్వాత అభిమానులు దీనికి తమదైన శైలిలో భాష్యం చెబుతూ కామెంట్స్ చేయడం గమనించొచ్చు. జైషా అభినందనలతో జైస్వాల్ కు టీమిండియాలో చోటు ఖాయమేనని కొందరు అభిమానులు నమ్ముతున్నారు.

 ‘‘సర్ దయచేసి టీమిండియాకి సెలక్ట్ చేయండి‘’ అని ఓ అభిమాని కోరాడు. ‘‘ఇది చాలా కీలక సమయం. మనం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ నుంచి మరింత ముందుకు సాగిపోవాల్సిన తరుణం. నేను కోహ్లీకి మద్దతు ఇస్తాను. కానీ మనం ఎలాగైనా ఈ ప్రపంచ కప్ గెలవాలి. తర్వాత వచ్చే ఏడాది టీ20 కప్ కూడా గెలవాలి’’ అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.

More Telugu News