Advertisement

చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగంలో పాల్గొన్న జగన్

Jagan participated in Yagam
  • విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో యాగం
  • ఉదయం 5 గంటలకు ప్రారంభమైన యాగ కార్యక్రమాలు
  • యజ్ఞ సంకల్పం తీసుకున్న జగన్
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా కల్యాణ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఏపీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగం ప్రారంభమయింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలు, వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేనల పూజలు, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో ప్రారంభమయింది. జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమయింది. గోశాల వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.  

ఈ నెల 17వ తేదీ వరకు 6 రోజుల పాటు మహాయజ్ఞం కొనసాగనుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో ఒక్కో యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో యాగ కార్యక్రమాలు జరగుతున్నాయి. భక్తులు వీక్షించేలా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక క్యూ లైన్ ను వీఐపీల కోసం ఏర్పాటు చేశారు. చివరి రోజున విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుంది.
Advertisement
Jagan
YSRCP
Yagnam

More Telugu News