Nara Lokesh: జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్ష నిదర్శనం ఇదే: లోకేశ్

  • నందికొట్కూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద లోకేశ్ సెల్ఫీ
  • ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతాంగం పరిస్థితులు మారిపోయేవని వ్యాఖ్యలు
  • జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపణ
Lokesh selfie at Jain irrigation project

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు లోకేశ్ కు స్వాగతం పలికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. 

నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తార్టూరు, మండ్లెం, తంగడంచ, జూపాడు బంగ్లా, తాటిపాడు, తరిగొప్పుల క్రాస్ మీదుగా బన్నూరు చేరుకుంది. మండ్లెం గ్రామంలో సాగునీటి కోసం జలదీక్ష చేస్తున్న గ్రామ రైతులకు యువనేత సంఘీభావం తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండ్లెం ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసి, సాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

అనంతరం మధ్యాహ్నం తంగడంచ వద్ద భోజన విరామ సమయంలో బీసీలతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద లోకేశ్ సెల్ఫీ

తంగడంచ వద్ద నిలిచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్ష నిదర్శనం నందికొట్కూరు నియోజకవర్గం తంగడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అభివర్ణించారు. 

రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. 

గత ప్రభుత్వంలో ఇందుకోసం 623 ఎకరాల భూమి కూడా కేటాయించారని, అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవని లోకేశ్ పేర్కొన్నారు. కానీ, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్ ప్రాజెక్టు నిలచిపోయిందని తెలిపారు.

బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం!

తంగడంచలో బీసీలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... జగన్ పాలనలో బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని అన్నారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలుగా బీసీలను తీర్చిదిద్దుతాం. టీడీపీ హయాంలో ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఇక్కడ గెలవకపోయినా నందికొట్కూరులో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వైసీపీ ఆ రెండు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది" అని మండిపడ్డారు.

బీసీల పుట్టినిల్లు టీడీపీ 

బీసీలకు పుట్టినిల్లు టీడీపీ అని, బీసీలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీ వల్లే అని లోకేశ్ స్పష్టం చేశారు. 

"బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసింది జగన్. కుర్చీ, టేబుల్స్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల భద్రత కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటం కోసం ఆర్ధిక సాయం అందిస్తాం. వైసీపీ రద్దు చేసిన రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తాం" అని వెల్లడించారు.

రద్దుచేసిన బీసీ సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తాం

బీసీ హాస్టళ్లు జగన్ పాలనలో నిర్వీర్యం అయ్యాయని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని లోకేశ్ విమర్శించారు. "బీసీ విద్యార్థుల చదువు కోసం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, విదేశీ విద్య పథకం, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేశారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బీసీ సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. 

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేశారు. నాలుగేళ్లు పడుకొని ఎన్నికల స్టంట్ కోసం మళ్లీ కొత్త తీర్మానం చేసి కేవలం 4 జిల్లాల్లో ఉన్న బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేశాడు. ఈ అంశంలో టీడీపీ హయంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చాం. ఇప్పుడు జగన్ మరోసారి తీర్మానం చెయ్యడం బోయ, వాల్మీకిలను మోసం చెయ్యడమే. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోయలు, వాల్మీకిలు ఏ వృత్తి చేసుకున్నా రుణాలు అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

యాదవులకు బంజర్లు కేటాయిస్తాం 

యాదవుల సంక్షేమానికి రూ.270 కోట్లు ఖర్చుచేశామని, పాడిపరిశ్రమను ప్రోత్సహించామని నారా లోకేశ్ వెల్లడించారు. మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీలో అందించామని తెలిపారు. 

"గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. గోకులాలు ఏర్పాటు చేశాం. జగన్ అధికారంలోకి వచ్చాక గోపాల మిత్ర వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు, పశువులు కొనడానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. మందులు, దాణా, మేత, ఇన్సూరెన్స్ కల్పిస్తాం. గొర్రెలు పెంపకం కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తాం" అని భరోసా ఇచ్చారు.

217 జీవోతో మత్స్యకారుల పొట్టగొట్టారు!

జగన్ జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టాడని లోకేశ్ విమర్శించారు. ఎప్పటి నుంచో మత్స్యకారులకు హక్కున్న చెరువులను వైసీపీ నాయకులు లాక్కున్నారని ఆరోపించారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 217 రద్దు చేసి మత్స్యకారులకు చెరువులు అప్పగిస్తాం. టీడీపీ హయాంలో వేట విరామ సమయంలో పెన్షన్ ఇచ్చాం. బోటు, వలలు, ఇతర పరికరాలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. బీసీ ఉపకులాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకే టీడీపీలో సాధికార సమితులు ఏర్పాటు చేశాం" అని వివరించారు.

గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్

సొంత లిక్కర్ అమ్ముకోవడానికి జగన్ కల్లు గీత కార్మికులపై కక్ష కట్టాడని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తామని వెల్లడించారు. 

"కల్లు గీతకు అవసరమైన పనిముట్లు అందజేస్తాం. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. తాటి చెట్ల పెంపకం కోసం ప్రోత్సాహం అందిస్తాం. టీడీపీ హయాంలో బీసీలకు ముఖ్యమైన పదవులు ఆర్ధిక శాఖ, టీటీడీ, ఏపీఐఐసీ, తుడా ఛైర్మన్ లాంటి ఎన్నో పదవులు ఇచ్చాం. జగన్ పాలనలో ముఖ్యమైన పదవుల్లో ఎవరు ఉన్నారో బీసీలు ఆలోచించాలి" అని లోకేశ్ కోరారు.

* యువగళం వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1223 కి.మీ*

*ఈ రోజు నడిచింది దూరం 16.1 కి.మీ*

*97వ రోజు (12.05.2023) పాదయాత్ర వివరాలు*

*నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)*

ఉదయం

7.00 – బన్నూరు శివారు క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం.

7.20 – కృష్ణారావుపేటలో గ్రామస్తులతో సమావేశం

9.00 - రుద్రవరంలో మైనారీటీలతో సమావేశం

10.10 – పాములపాడులో రైతులతో సమావేశం

10.40 – పాములపాడు శివార్లలో ఎస్సీలతో ముఖాముఖి

11.40 – పాములపాడులో భోజన విరామం

సాయంత్రం

4.00 పాములపాడు నుండి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – కంభాలపల్లెలో గ్రామస్తులతో మాటామంతీ.

5.05 – ఎర్రగూడురులో గ్రామస్తులతో మాటామంతీ.

*శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.*

5.55 – నందికొట్కూరు/శ్రీశైలం సరిహద్దుల్లో స్థానికులతో భేటీ.

6.30 – కె.స్టార్ గోడౌన్ వద్ద విడిది కేంద్రంలో బస

******

More Telugu News