Delhi Metro: కిస్సింగ్ వీడియో కలకలం.. బాధ్యతతో వ్యవహరించాలన్న ఢిల్లీ మెట్రో

  • మెట్రో రైలులో ఓ జంట ముద్దుల్లో మునిగితేలిన వీడియో వైరల్ 
  • ప్రయాణికులు అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడవద్దని డీఎంఆర్ సీ విజ్ఞప్తి
  • ఇలాంటి ఘటనలపై మెట్రో సిబ్బంది, లేదా సీఐఎస్‌ఎఫ్‌కు ఫిర్యాదు చేయాలని సూచన
On Video Of Couple Kissing In Coach Delhi Metros Appeal To Commuters

ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువ జంట ముద్దుల్లో మునిగితేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ మెట్రో కోచ్ లో నేలపై కూర్చున్న ఓ యువకుడి ఒడిలో అమ్మాయి పడుకోగా, ఆమెకు అతడు ముద్దులు పెడుతూ కనిపించాడు. ఢిల్లీ మెట్రోలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కిస్సింగ్ వీడియోలు కలకలం రేపాయి.

తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) స్పందించింది. ప్రయాణికులు ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినపుడు సమీపంలో అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది/సీఐఎస్‌ఎఫ్‌కు వెంటనే తెలియజేయండి. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ప్రయాణికులను మెట్రో అధికారులు కోరారు. 

ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ‘‘సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్‌లను అనుసరించాలని కోరుతున్నాం. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే లేదా తోటి ప్రయాణికుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాల్లో పాల్గొనొద్దు. డీఎంఆర్‌సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం సెక్షన్ 59 ప్రకారం అసభ్యత అనేది శిక్షార్హమైన నేరం’’ అని డీఎంఆర్ సీ ఓ ప్రకటనలో హెచ్చరించింది.

More Telugu News