Anand Mahindra: రాజస్థాన్ లో భారీ లిథియం నిల్వలు.. ఆనంద్ మహీంద్రా కీలక సూచన

  • 21వ శతాబ్దపు వృద్ధికి కీలకమైన వనరులు లభించాయన్న పారిశ్రామికవేత్త
  • నిల్వల కంటే రిఫైనింగ్ సామర్థ్యాలు కీలకమన్న అభిప్రాయం
  • చైనా ఈ విషయంలోనే ముందుందంటూ ట్వీట్
Anand Mahindra on what India needs to do to utilise lithium reserves found in Rajasthan

జమ్మూ కశ్మీర్ లో లిథియం అయాన్ నిల్వలు బయటపడిన కొన్ని నెలలకే, రాజస్థాన్ లో అంతకుమించిన భారీ నిల్వలున్నట్టు జియోలాజికల్ సర్వే విభాగం ప్రకటించడం మన దేశానికి ఎంతో సానుకూలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వాహన కాలుష్యం తగ్గించేందుకు, పెట్రోలియం దిగుమతులు తగ్గించుకోవాలన్న సంకల్పంతో కేంద్ర సర్కారు ఉంది. దీంతో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలకు ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరి ఇందులో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల కోసం మనం చైనాపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. 

ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ లో బయటపడిన లిథియం నిల్వలను త్వరగా ఉత్పత్తిలోకి తీసుకొస్తే దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా సైతం ట్విట్టర్ లో దీనిపై తన స్పందన వ్యక్తం చేశారు. 

‘‘21వ శతాబ్దంలో వృద్ధికి కీలకమైన భారీ సహజ వనరుల నిల్వలను మనం ఎట్టకేలకు గుర్తించాం. భారత్  కు విద్యుదీకరణ భవిష్యత్ ఉందనడానికి ఇది సంకేతం. కానీ, ఈ కీలకమైన మూలకం సరఫరా కావాలంటే నిల్వలు  కాదు, రిఫైనింగ్ ముఖ్యం. చైనా ఈ విషయంలోనే అగ్రగామిగా ఉంది. కనుక మనం వేగంగా రిఫైనింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.

More Telugu News