Muthireddy: తనపై కుమార్తె ఫిర్యాదు చేయడంతో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కుమార్తె తుల్జా భవాని ఫిర్యాదు
  • తన సంతకం ఫోర్జరీ చేశారన్న భవాని
  • చేర్యాలలో ఉన్న భూమిని తన పేర మార్చుకున్నారని ముత్తిరెడ్డిపై ఆరోపణ
  • ఫోర్జరీ చేయలేదన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • భూమి తన కుమార్తె పేరుమీదనే ఉందని స్పష్టీకరణ
  • ఇది రాజకీయ కుట్ర అని ఆగ్రహం
MLA Muthireddy breaks into tears

ఓ భూవివాదంలో సొంత కూతురే తనపై కేసు పెట్టడంతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు. 

సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తనకు 1 ఎకరం 20 కుంటల భూమి ఉందని, తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేశారని, ఆ భూమిని ఆయన పేరు మీద మార్చుకున్నాడని ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కుమార్తె తుల్జా భవాని ఆరోపణలు చేశారు. ఈ మేరకు తండ్రిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

కుమార్తె ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెకు ఇచ్చిన ఆస్తి ఆమె పేరు మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామని ముత్తిరెడ్డి వివరించారు. 

అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయని తెలిపారు. తన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయ, ప్రజా జీవితానికి ఆపాదించడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓ పావుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని మండిపడ్డారు. 

కాగా, గతంలోనూ ఇదే భూమి విషయంలో ముత్తిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. చెరువు భూమిని కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి.

More Telugu News