APSRTC: ఏపీ ఎస్ఆర్టీసీలో ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’.. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం!

  • ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ను ప్రారంభిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ
  • ఒక బస్సు నుంచి ఇంకో బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల సమయం
  • తొలుత 137 రూట్లలో అందుబాటులోకి
  • ఈ విధానాన్ని తీసుకొస్తున్న తొలి సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ
APSRTC Launching Multi City Journey Reservation system

ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ పేరిట తీసుకొచ్చిన ఈ విధానంలో ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుడు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి నేరుగా బస్సు లేనప్పుడు మధ్యలో ఓ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి మరో బస్సులో ప్రయాణించి వెళ్లాల్సిన చోటుకు చేరుకోవచ్చు. 

‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’లో భాగంగా రెండు బస్సుల్లో ప్రయాణించినా రిజర్వేషన్ చార్జీ మాత్రం ఒకసారికే వసూలు చేస్తారు. ఈ విధానంలో ప్రయాణికుడు ఒక బస్సులో ప్రయాణించి మధ్యలో మరో ప్రాంతంలో దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకునే బస్సులోకి మారేందుకు 2 నుంచి 22 గంటల సమయం ఉంటుంది. 

ఆ సమయాల్లో ఉన్న సర్వీసులను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలుత అమలు చేస్తారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కానీ, ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కానీ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిని ప్రారంభించనున్నారు. కాగా, ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ను అందుబాటులోకి తీసుకొస్తున్న తొలి సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ రికార్డులకెక్కనుంది.

More Telugu News