BSF: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 13 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం

  • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన
  • స్మగ్లింగ్‌పై ఉప్పందుకున్న బీఎస్ఎఫ్ అధికారులు
  • నిఘా పెంచి కాపుకాసిన సిబ్బంది
  • అర్ధరాత్రి వేళ భారత్‌లోకి ప్రవేశించిన స్మగ్లర్లపై కాల్పులు
  • పారిపోతూ పాము విషం నింపిన గాజు జార్‌ను జార విడిచిన స్మగ్లర్లు
Jar full of precious cobra venom worth Rs 13 crore seized

బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న పాము విషాన్ని బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పమన్‌పరా గ్రామంలో స్మగ్లర్లు పారిపోతూ పాము విషంతో నింపిన గాజు జార్‌ను జారవిడిచారు. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని స్వాధీనం చేసుకున్నారు.

పాము విషం స్మగ్లింగ్‌పై ఉప్పందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో ఇద్దరు స్మగ్లర్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. 

ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా స్మగ్లర్లు జారవిడిచిన ఓ గాజు జార్ దొరికింది. అందులో పాము విషాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాపై ‘మేడిన్ ఫ్రాన్స్’ అని రాసి ఉన్నట్టు తెలిపారు. ఆ విషం కోబ్రాదని, దాని విలువ రూ. 13 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషపు సీసాను అటవీ అధికారులకు అందించారు.

More Telugu News