Ambati Rambabu: రజనీకాంత్ పిరికివాడు... అప్పుడే పారిపోయాడు: అంబటి రాంబాబు

  • తమిళనాట రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి పారిపోయాడన్న అంబటి
  • రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య
  • ఆ సమయంలో రజనీకాంత్... చంద్రబాబు వెంటే ఉన్నారని విమర్శ
Ambati Rambabu terms Rajinikanth as a coward

రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొన్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైన మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రజనీని పిరికివాడిగా అభివర్ణించారు. గతంలో తమిళనాట తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి, పారిపోయాడని ఎద్దేవా చేశారు. 

రజనీకాంత్ కు రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును పదవీచ్యుతిడిని చేసిన సమయంలోను రజనీకాంత్... చంద్రబాబు వెంటే ఉన్నారని ఆరోపించారు. అటు, కొడాలి నాని, రోజా తదితరులు కూడా రజనీకాంత్ పై నిప్పులు చెరిగారు.

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, 2024లో చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని, అప్పుడు ఏపీని దేశంలోనే అత్యున్నత శిఖరాలకు తీసుకువెళతాడని ప్రశంసించారు. 

విజన్ 2047తో ఏపీని అభివృద్ధి చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, అది కార్యరూపం దాల్చితే దేశంలోనే ఏపీ గొప్ప స్థాయికి చేరుకుంటుందన్నారు. 1990వ దశకం చివరలో ఐటీ గురించి ఎవరూ ఆలోచించని సమయంలో చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు చంద్రబాబును ప్రశంసించారన్నారు.

More Telugu News