BJP: టీడీపీలో చేరతారన్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన

  • ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని వీడేదిలేదన్న గోషామహల్ ఎమ్మెల్యే
  • రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ
  • సస్పెన్షన్ ఎత్తివేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోని హైకమాండ్
Mla Rajasingh reaction over party change

గోషామహల్ ఎమ్మెల్యే, హిందూ టైగర్ గా అభిమానులు పిలుచుకునే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా టీడీపీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ తో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే సమస్యేలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

ఓ వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. పీడీ యాక్ట్ కూడా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తనపై విధించిన సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేస్తుందని రాజాసింగ్ ఎదురుచూస్తున్నారు. అయితే, రోజులు గడుస్తున్నా పార్టీ పెద్దలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టిపెట్టారని, ఇందులో భాగంగానే టీడీపీలో చేరాలని భావిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి.

More Telugu News