Chandrababu: హెచ్ఆర్సీ చెబితే కూడా వినరా? ఇదేనా మీ మానవత్వం?: చంద్రబాబు

  • కుప్పం మున్సిపాలిటీ పరిధిలో విషాదం
  • అంగన్ వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మృతి
  • పరిహారం చెల్లించాలన్న హెచ్ఆర్సీ
  • హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • న్యాయస్థానానికి రాకుండా ఉండాల్సిందన్న హైకోర్టు
Chandrababu slams state govt

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లిలో ఓ అంగన్ వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిన్న చిన్నారి మరణించడం తెలిసిందే. ఈ వ్యవహారంలో మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని, పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంపై ఓ పత్రికా కథనం వచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ బాలిక మరణించిందని మండిపడ్డారు.

ఆ బాలిక కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని హెచ్ఆర్సీ చెబితే... ఇవ్వడం కుదరదు అంటూ హైకోర్టుకు వెళ్లారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ సంక్షేమ ప్రభుత్వం? కనీస మానవత్వం కూడా లేదా? అని ప్రశ్నించారు. కోర్టుకు రాకుండా ఉండాల్సిందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఎంత సిగ్గుచేటు! అని చంద్రబాబు విమర్శించారు. 

గుల్లేపల్లి అంగన్ వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని మరణించిన చిన్నారి కుటుంబానికి హెచ్ఆర్సీ చెప్పినట్టుగా పరిహారం వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More Telugu News