YS Sharmila: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన షర్మిల... తీర్పును రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు

  • పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి
  • కారును వేగంగా పోనిచ్చి కానిస్టేబుల్ ను గాయపరిచారన్న లాయర్
  • షర్మిల చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తాయని వాదన
  • ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారన్న షర్మిల లాయర్
  • పోలీసులు కొట్టడంతో వారిని తోసేశానని చెప్పిన షర్మిల
  • వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
YS sharmila bail petition in Nampally court

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆమె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. 

తొలుత పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తారని, అలాంటి వారి పైన చేయి చేసుకున్నారని, ఇలాంటి చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తాయని పేర్కొన్నారు.

షర్మిల తన కారు డ్రైవర్ ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కాలికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా, ఎస్సై పైన, మహిళా కానిస్టేబుల్ పైన ఆమె చేయి చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.

మరోవైపు, షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటకు వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. 

ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల జడ్జికి తెలిపారు. పోలీసులు చాలామంది తనను అడ్డుకొని చెయ్యి విరిచే ప్రయత్నం చేశారని, తనను కొట్టారని, ఈ క్రమంలో తాను వారిని తోసేసినట్లు చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

More Telugu News