preeti: ప్రీతిది ఆత్మహత్య అని నమ్ముతున్నాం.. కానీ..: సీపీని కలిసిన ప్రీతి తండ్రి

  • ప్రీతిది ఆత్మహత్యే అని తాము నమ్ముతున్నామని తండ్రి
  • దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని వ్యాఖ్య
  • కొందరి పేర్లు చేర్చాలని సీపీని కలిసిన నరేందర్
Preethi father met Warangal CP on suicide case

కేఎంసీ మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ ఆత్మహత్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెది ఆత్మహత్యనే అని, అయితే ఇందుకు సైఫ్ ప్రధాన కారణమని సీపీ రంగనాథ్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు శనివారం సీపీని కలిశారు. అనంతరం తండ్రి మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యే అని తాము నమ్ముతున్నామని చెప్పారు. కేసు దర్యాఫ్తు కూడా నిష్పక్షపాతంగానే జరుగుతోందని నమ్ముతున్నామన్నారు. అయితే ఛార్జిషీటులో ఇంకా కొందరి పేర్లను చేర్చాల్సిందని, వారు కూడా చేర్చుతామని చెప్పారన్నారు.

కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీల బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. ఈ కేసు పైన ఉన్న సందేహాలను సీపీని అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ప్రీతిది ఆత్మహత్య అని చెబుతూ, కొన్ని ఆధారాలను చూపించారన్నారు. త్వరలో ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

కాగా, ప్రీతి మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక వివరాలను వరంగల్ సీపీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా రిపోర్ట్ ప్రకారం ఆమెది ఆత్మహత్య అని తేలిందని, అయితే సైఫ్ వేధింపుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. కాగా, ఇటీవల సైఫ్ కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

More Telugu News