VV Lakshminarayana: ప్రజా విరాళాలను అంగీకరిస్తారా?: స్టీల్ ప్లాంట్ సీఎండీకి లక్ష్మీనారాయణ లేఖ

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఈవోఐ ప్రకటన
  • బిడ్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ
  • క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తామని వెల్లడి
  • ఇదే అంశంపై మరింత స్పష్టత కోరుతూ ఆర్ఐఎన్ఎల్ కు లేఖ
VV Lakshminarayana wrote RINL CMD

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొనడం తెలిసిందే. బిడ్డింగ్ కు అవసరమైన నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ రూపంలో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించారు. అయితే, ప్రజల నుంచి సేకరించిన విరాళాలను అంగీకరిస్తారా... లేదా...? అంటూ లక్ష్మీనారాయణ తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) సీఎండీకి లేఖ రాశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకు సరఫరా కోసం, లేక మూలధనం కోసం నిధుల సమీకరణ నిమిత్తం గత నెల 27న ఈవోఐ జారీ అయిందని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. 

"ఈవోఐలో పేర్కొన్న ప్రకారం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం (7.3 ఎంపీటీఏ ) మేరకు పనిచేయాలంటే నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు కావాలి. అందుకు అవసరమైన నిధులను మేం ప్రజల నుంచి సేకరించాలని నిర్ణయించాం. విరాళాల రూపంలో అందిన మొత్తాలను మేం నేరుగా ఆర్ఐఎన్ఎల్ ఖాతాలకు బదిలీ చేస్తాం. 

ఇటీవల అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కూడా ప్రజలు ఇలాగే విరాళాలు అందించారు. ఇలాంటి ప్రజా విరాళాలను ఆర్ఐఎన్ఎల్ అంగీకరిస్తుందా అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనిపై మీరు స్పందించి సమాధానం ఇస్తే ఎంతో సంతోషిస్తాం. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లడానికి దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం.

 ఒకవేళ ఇంకేమైనా చర్చలు, సంప్రదింపులు అవసరం అనుకుంటే, మీ మార్గదర్శనంలో మరింత గట్టిగా కృషి చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు తగిన విధంగా వ్యవహరిస్తాం" అని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News